గంజాయికి బానిసై ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలి బలవన్మరణం

  • యానాంలోని యూకేవీనగర్‌లో ఘటన
  • గంజాయి కోసం సోదరుడు డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుడి ఆత్మహత్య
  • యువకుడిని కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనలో ప్రియురాలు
  • సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
గంజాయికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు లేని లోకంలో తానుండలేనంటూ అతడి ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. యానాంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

యానాంలోని యూకేవీనగర్‌కు చెందిన మీసాల మౌనిక తన మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ నర్సింగ్ విద్య చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. మౌనిక రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలో ఉంది. అయితే, చిన్నా గంజాయికి బానిసైపోయాడు. రెండు రోజుల క్రితం అతడు తన సోదరుడిని గంజాయి కోసం రూ.500 అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో, క్షణికావేశానికి లోనైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు. చివరకు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

ప్రియుడు దూరమవడంతో మౌనిక తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది. చిన్నా ఫొటోలను తన ఇంటి గోడలకు అంటించి, అతడి వస్తువులను తన గదిలో పెట్టుకుని వాటినే చూస్తూ తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రిమూర్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Yanam
Andhra Pradesh
Crime News

More Telugu News